Thursday, February 19, 2009
బ్లాగు మూసెయ్యలేదు కానీ
Tuesday, June 03, 2008
పాండవులెవరు?
- తటవర్తి రామచంద్రరావు
వ్యాసమహర్షి మహాభారతంలో భూమికి ప్రతిస్వరూపమైన కుంతిని సృష్టించాడు. కు అంటే భూమి. కుంతి అంటే భూ స్వరూపమే. కుంతికి పృధ అని మరో పేరుంది. అంటే పృధ్వి అని అర్థం.
ఆమె ముందు ప్రత్యక్షమైన సూర్యదేవుడు ఆమె నాభిని స్పృశించి ఆమె గర్భంలో ప్రవేశించి స్వర్ణకవచకుండలాలతో ఉన్న కర్ణుడికి జన్మకారకుడైనాడు. అంటే, సూర్యకిరణాల సహాయంతో భూమి మీద జీవరాశి ఉద్భవించిందనటానికి సంకేతం. వృక్షరాజ్యానికిది నాంది పలికింది. కర్ణ అంటే ధాన్యమని మరో అర్థం. అంటే కర్ణుడు వృక్షాలకు మూలమైన విత్తనాలకు సంకేతం. నీళ్ళు లేనిదే విత్తనం మొలకెత్తదు. అందుకే కుంతి కర్ణుడిని బుట్టలో పెట్టి నదిలో వదిలింది. ఆ బుట్టను అధిరథుడు చూసి కర్ణుణ్ని ఒడ్డుకు తెచ్చాడు. అధిరథుడంటే సారథి అని అర్థం. కర్ణుడి జీవితానికి అతను నిజంగానే సారథి. ఆ తరవాత కర్ణుడు అంగరాజు అయ్యాడు. అంటే శరీరాంగాలకు రాజు అయ్యాడు. శరీరాన్ని పోషించేది ఆహారం కనుక దానికి మూలాధారమైనాడు. మనకు ఆహారంగా లభ్యమయ్యే కూరలకు, పళ్ళకు, ధాన్యానికి పైన రక్షణగా తొక్క, బెరడు, పొట్టు లాంటివేవో ఒకటి ఉంటాయి. కర్ణుడి కవచం దానికి సంకేతం. ప్రతి చెట్టునుంచీ పళ్ళు వేలాడతాయి. కర్ణుడి కుండలాలు వాటికి చిహ్నాలు.
సూర్యశక్తితో ప్రథమపుత్రుడి ద్వారా వృక్షజాతికి జన్మనిచ్చిన కుంతి, జంతుజాతిలో అత్యుత్తముడిగా పుట్టిన మనిషికి కావాల్సిన అయిదు శక్తులకు పంచపాండవుల ద్వారా జన్మకారకురాలైంది.
బుద్ధికి యుధిష్ఠిరుడు, మనస్సుకు భీముడు, ప్రాణానికి అర్జునుడు, కాళ్ళుచేతులకు నకుల సహదేవులు సంకేతాలు. ఒకరి తరవాత ఇంకొకరు పుట్టటంలో కూడ ఒక అర్థం ఉంది. తల్లి గర్భం నుంచి ముందు బయటకు వచ్చేది బిడ్డతల. అక్కడే బుద్ధి ఉండేది. తరవాత వచ్చేవి కనుబొమలు. వాటిమధ్యనే కేంద్రీకృతమయ్యేది మనస్సు. తరవాత చెవులు, ముక్కు, నోరు బయటకు వస్తాయి. ప్రాణాధారమైన ఊపిరికి అవే ఆలవాలాలు. అక్కడితో మనిషి పుట్టుకకు నాంది జరిగింది. అయితే, ఆ శరీరం పనిచేయటానికి కాళ్ళు చేతులు కావాలి. అవి రెండు రెండుగా ఉండటమే కాకుండా ఒకేలా ఉంటాయి. నకుల సహదేవులు కవలలుగా పుట్టటం కూడా దానికే సంకేతం!
పైన చెప్పినట్లు మనిషి జీవితానికి అవసరమైన సృష్టి కుంతీపుత్రుల రూపంలో జరిగిందని వ్యాసమహర్షి తన మహాభారతకథ ద్వారా మనకు సూచించాడు. భూమిని రక్షించుకోకపోతే భవిష్యత్తులో మనిషి మనుగడకు ప్రమాదం సంభవిస్తుందని అంతా గుర్తించాల్సిన సమయమిది!
Wednesday, June 06, 2007
ద్రౌపది ప్రేమ
ఆమె కర్ణుణ్ణి కోరుకున్నమాటే నిజమైతే ఇక్కడ యుధిష్టిరుడి సమాధానమెలా ఉండేదో మీరే ఊహించవచ్చు. ఒక పరపురుషుణ్ని కోరుకున్న పాపానికి అసలు ఆమెను స్వర్గలోక ఛాయలకైనా రానిచ్చి ఉండేవారు కాదు.
ఇంతకూ అక్కడ రానారె అడిగిన ప్రశ్నకు సమాధానం నాకు తెలియదు. మీకేమైనా తెలిస్తే చెప్పండి.
Sunday, February 11, 2007
ఆ ఐదుగురు
ముందుగా బకాసురుడి సంగతి చూద్దాం. వీడు వీరోచితకృత్యాలు చేసినట్లు ఎక్కడాలేదు. వాడు చేసిందల్లా ఏకచక్రపురమనే అగ్రహారంలోని వాళ్ళను బెదిరించి పొట్టపోసుకోవడం. వాడి తిండి, ఆకారం చూసి ఆ అగ్రహారంలోని బ్రాహ్మలు వాడినెదిరించడానికి భయపడినట్లు అనిపిస్తుంది. వాణ్ణెదిరించేవాడెవరూ లేనంతవరకు మాత్రమే వాడి ఆటలు చెల్లాయి. బకాసురుడి జీవితకాలంలో వాడి వీరత్వానికి ఒకే ఒక సవాలు ఎదురైంది - భీముడి రూపంలో. ఆ ఒక్కసారీ వాడు దారుణంగా ఓడిపోయాడు. భీముడు బండెడు కూడు తిని భుక్తాయాసమైనా తీర్చుకోకుండానే వాడితో తలపడి చంపేశాడంటేనే వాడి వీరత్వమేమిటో స్పష్టమైపోతుంది.
భీముడికి చిన్నప్పట్నుంచి ఏ విషయంలోనైనా తన Id impulses ను అదుపులో పెట్టుకునే అలవాటులేదు. అందుకే తానున్నది అజ్ఞాతవాసంలోనైనా కీచకుడు తన భార్యను అవమానించాడనే కోపావేశంతో ఉన్న భీముడు వాడి శవాన్ని ఆనవాలైనా పట్టడానికి వీల్లేకుండా ఒక మాంసపుముద్దగా చేసిపారేశాడు. బేసిగ్గా బకాసురుడు, కీచకుడు ఒకలాంటివాళ్ళే. రెండే తేడాలు:
1. మొదటివాడికి కడుపే కైలాసం. రెండోవాడి ఆకలి వేరు.
2. మొదటివాడికి ఎటువంటి అధికారహోదా లేదు. రెండోవాడికి అధికారమదం, బలగర్వం ఉన్నాయి.
కీచకుడు వీరుడే. కొన్ని యుద్ధాలు గెలిచాడు. కానీ మహావీరుడంటే మాత్రం ఆలోచించాల్సిందే! నిజంగా కీచకుడు గొప్ప వీరుడే ఐతే విరాటరాజ్యం "దోమకుత్తుకంతే" ఎందుకుంటుంది? వీళ్ళిద్దరి గురించీ రాసినవాటిలో అతిశయోక్తులే ఎక్కువ.
దుర్యోధనుడు: వీడిది వజ్రకాయం. ధర్మబద్ధంగా ఐతే భీముడైనా, వాడి తాతైనా వీడిని గెలవలేకపోయేవాళ్ళు.(ఈ తాత గురించి ఇంకోసారి చెప్పుకుందాం.) పైగా వీడు గదాయుద్ధంలో మెళకువలు నేర్చుకున్నది(అడ్వాన్సుడు కోర్సు చేసింది) బలరాముడి దగ్గర. ఈ బలరాముడికి సరిజోడీ ఐనవాడు జరాసంధుడు.
జరాసంధుడు: చర్వితచర్వణం కాకుండా జరాసంధుడి గురించి ముందుగా నేను రాసింది ఇక్కడ చదవండి. అక్కడ "నమ్మశక్యంగా లేదు" అని ఎందుకు రాశానో మాత్రం ఇక్కడ వివరిస్తాను:
కృష్ణుడు భీమార్జునులను వెంటబెట్టుకుని గిరివ్రజానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో గమనిస్తే చాలు - జరాసంధుడెలాంటివాడో తెలిసిపోతుంది:
వాళ్లు రావడమే దొడ్డిదారిన వచ్చారు. రావడంతోటే భేరీలను పగలగొట్టి విధ్వంసానికి పాల్పడ్డారు. వేరే ఎవరైనా ఐతే ఆ పని చేసినందుకు వాళ్ళను తన్నితగలేసేవాళ్ళు. ఐనా జరాసంధుడు వాళ్ళను ఆదరంగానే చూశాడు. తప్పుచేసి తన చేతికి చిక్కిన శతృవులనే ఏమీ చెయ్యకుండా వదిలినవాడుగా కనిపిస్తాడు జరాసంధుడు ఇక్కడ. ఆ ఆదరాన్ని కూడా తృణీకరించి వాళ్ళు అతణ్ణి అవమానించారు. మీరెవరని అడిగినప్పుడు వాళ్ళు తాము బ్రాహ్మణులమని చెప్పుకున్నారు. అప్పుడు వాళ్ళను చూసి జరాసంధుడు ఇలా అంటాడు: "మీ చేతులు ఆయుధాలు ప్రయోగించడానికి అలవాటుపడినవాళ్ళలా కాయలుకాచి ఉన్నాయి గానీ బ్రాహ్మణుల చేతుల్లా లేవు. ఐనా మీరెవరన్నది నాకనవసరం..." అని వాళ్ళకు అతిథులకు చేయదగిన మర్యాదలన్నీ చేస్తాడు.
చివరకు తామెవరో చెప్పి యుద్ధం చేస్తామన్నప్పుడు కూడా "18 సార్లు నా దెబ్బకు తట్టుకోలేక పారిపోయినవాడివి నువ్వు నాతో ఏం పోరాడుతావ్?" అని కృష్ణుణ్ణీ, మరీ అర్భకుడుగా ఉన్నాడని అర్జునుణ్ణీ వదిలేసి బుద్ధిపూర్వకంగానే భీముణ్ణి ఎంచుకుంటాడు. ఛాయిస్ తనకే ఇచ్చారు కదాని ముందుగా కృష్ణార్జునులను ఒకరి తర్వాతొకరిని రమ్మని చావచితక్కొట్టినా, లేక చంపిపారేసినా అడిగే దిక్కులేదు. ఐనా వాళ్ళు అంతదూరం వచ్చారంటే అది అతడి ధర్మనిరతి మీద వాళ్ళకున్న నమ్మకమే. ఇంతటి ధర్మపరుడు నరబలులిస్తాడంటే నమ్మడమెలా? అందునా సాటి రాజులను? పైగా అతడు నిజంగా నరబలులే ఇస్తున్నట్లైతే వీళ్ళు తన చిరకాల శతృవులని, ఇప్పుడు ఒంటరిగా చిక్కినారని తెలిసీ ముగ్గురినీ బంధించి అదే వరసలో బలి ఇవ్వకుండా ఎందుకు వదిలేసినట్లు? ప్రతీకారం తీర్చుకుంటారేమోనని భయమా? భీమార్జునులే చచ్చినాక పాండవుల వైపు కసిదీర్చుకునే వీరుడెవడున్నాడని? మహా ఐతే కృష్ణుణ్ణి కోల్పోయిన బలరాముడు దండెత్తివచ్చేవాడు. జరాసంధుడికి బలరాముడి వీరత్వం మీద ఏ కాస్త గౌరవమున్నా మథుర మీద అన్నిసార్లు దండెత్తేవాడే కాదుగద? ఐనా ఆ బలరాముడే జరాసంధుణ్ణి జయించగలిగితే వీళ్ళకీ తిప్పలెందుకు? జరాసంధుణ్ణి చంపడానికి చీకట్లో వెళ్ళడమే ఒక సూచన - అధర్మమార్గంలో చంపారనడానికి.
Saturday, December 23, 2006
కలలు నిజమాయె(నా?)
ఈ రోజు ఈనాడు ఆదివారంలో వచ్చిన ఒక వ్యాసంలోని కొన్ని అంశాలు:
రామాయణంలో రావణాసురుడికి పుష్పక విమానం ఉండేది. అది ఏవియేషన్... అనగా ఆకాశయానం! తన కంటే ముందు కుంతికి కొడుకు పుట్టాడనే ఆక్రోశంతో గర్భవిచ్ఛిత్తికి పాల్పడింది గాంధారి. ఛిద్రమైన పిండాన్ని వ్యాసుడి సూచనతో కుండల్లో పెట్టి జాగ్రత్తచేశారు. అలా పుట్టినవారే కౌరవులు. వాళ్లని టెస్ట్ట్యూబ్ బేబీలనొచ్చా?
అనకూడదు. టెస్ట్ ట్యూబ్ బేబీలనేది పూర్తిగా వేరే వ్యవహారం. ఇక్కడ కౌరవుల పిండం ఏర్పడడంలో సాంకేతికత ప్రమేయమేమీ లేదు. గాంధారి గర్భధారణ మామూలుగానే జరిగింది. ఐతే కౌరవులు పూర్తిస్థాయిలో పిండం ఎదగకుండానే పుట్టినవాళ్ళు. అంటే ప్రీ మెచ్యూర్ బేబీలన్నమాట. వాళ్లను నేతికుండల్లో పెట్టి పెంచారు. ఆ నేతి కుండలను నేటి ఇన్క్యుబేటర్లతో పోల్చవచ్చు.
ఐతే మహాభారతంలోనే అంతకు రెండు తరాల ముందు పుట్టిన టెస్ట్ ట్యూబ్ బేబీ ఒకరున్నారున్నారండోయ్! ఆయనే ద్రోణుడు. ఆ ద్రోణుణ్ణే దానవీరశూరకర్ణ సినిమాలో "నీచమైన మట్టికుండలో పుట్టితివికదా?" అని ఈసడిస్తాడు దుర్యోధనుడు. ద్రోణుడికంటే ముందు అదే పద్ధతిలో పుట్టినవాళ్ళు అగస్త్యుడు, వసిష్ఠుడు. ఇద్దరికిద్దరూ గొప్ప ఋషులు. ఈ వసిష్ఠుడు రఘువంశానికి కులగురువు. అగస్త్యుని గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి.
వినాయకుడికి ఏనుగు తల అతికించాడు శివుడు... ఇది ప్లాస్టిక్సర్జరీ. ప్రస్తుతానికి తలలు మార్చలేం కానీ తెగినవేళ్లూ కాళ్లూ అతికించే దశలో ఉన్నాం. మంచి అభివృద్ధే!
అబ్బా...? అలాగా?!
మన పురాణాలన్నిట్లో కనిపించే మాయమవడం, ప్రత్యక్షమవడం, అణిమాది అష్టసిద్ధులూ... అన్నీ కథలూ, కల్పితాలేనంటారా. మరీ అంత తొందరపడి కొట్టిపారేయకండి.
చిత్తం!
Friday, October 06, 2006
రామాయణం-మహాభారతం
మన ప్రవర్తన ఎలా ఉండాలో రామాయణంలోని పాత్రలు చెబుతాయి:
అన్నదమ్ముల అనుబంధం: రామ-లక్ష్మణులు
స్నేహం: సుగ్రీవమైత్రి
తండ్రీకొడుకుల అనుబంధం: దశరథ-రాములు
యజమాని-సేవకులు: రామ-హనుమ
పాలకుడు-ప్రజలు: రాముడు-అయోధ్య ప్రజలు
ఐతే భార్యాభర్తల అనుబంధమెలా ఉండాలో తెలుసుకోవడానికి మాత్రం రామాయణంలో వెదక్కండి. ఒక ఆదర్శవంతుడైన పాలకుడిగా ఉండాలో, లేక ఒక మంచి భర్తగా ఉండాలో నిర్ణయించుకోవలసిన పరిస్థితి ఎదురైనప్పుడు రాముడు ఒక మంచి పాలకుడిగా ఉండడానికే నిశ్చయించుకున్నాడు. ఎటుతిరిగీ తన తప్పేమీ లేకుండా ఆ నిర్ణయానికి బలైపోయింది మాత్రం సీత. (సీత-ద్రౌపదుల గురించి వివరంగా ఇంకొకసారి)
ఇక మహాభారతం విషయానికొస్తే అది అన్నదమ్ముల బిడ్డల (దాయాదుల) మధ్య ఆస్థి (రాజ్యం) కోసం జరిగిన గొడవ. ఇలాంటి గొడవ రామాయణంలో వాలి-సుగ్రీవుల మధ్య జరిగినట్లనిపించినా అక్కడి పరిస్థితులు వేరు. సుగ్రీవుడు తనను చంపడానికి కుట్ర పన్నాడని వాలి బలంగా నమ్మాడు. సుగ్రీవుడి సదుద్దేశాన్ని ఋజువుచేసే ఆధారాలేమీ లేవు. పైగా వాలి తిరిగొచ్చేటప్పటికి సుగ్రీవుడు వాలి భార్యతో ఉంటూ, వాలి రాజ్యాన్ని పాలిస్తున్నాడు. అందుకే వాలి సుగ్రీవుడి మీద ద్వేషం పెంచుకున్నాడు. ఇక తను చెప్పేది ఏ మాత్రమూ నమ్మక వాలి నేరుగా తనను చంపవస్తే పారిపోవడమో ఎదురు తిరగడమో తప్ప సుగ్రీవుడికి గత్యంతరం లేదు.
మహాభారతంలో నాకు కౌరవులు-పాండవుల మధ్య మౌలికంగా ఎటువంటి తేడా కనబడలేదు. వాళ్ళు చేసింది అధర్మమైతే వీళ్ళూ తక్కువేమీ చెయ్యలేదు. వీళ్ళు వీరులైతే వాళ్ళ వైపు అంతకంటే గొప్ప వీరులున్నారు. ధర్మరాజుగా పిలవబడే యుధిష్ఠిరుడు జూదం ఆడేటప్పుడు ఎంతటి హీనస్థితికైనా దిగజారుతాడని ఒకసారి కాదు రెండుసార్లు ఋజువైంది. ఇతర విషయాల్లో కూడా అతడి ప్రవర్తన నాకేమీ ఉదాత్తంగా అనిపించలేదు. అతడికి ధర్మం తెలుసు. కానీ తనకు తెలిసిన ధర్మాన్ని అతడు పాటించడంలోనే వచ్చింది తేడా.
జూదం సప్తవ్యసనాల్లో ఒకటి. తప్పుడుపని అన్న తర్వాత ఎవరుచేసినా తప్పే. జూదం యుధిష్ఠిరుడి అతిపెద్ద బలహీనత - తనతోబాటు తోడబుట్టినవాళ్ళను, కట్టుకున్న పెళ్ళాన్ని సైతం తాకట్టు పెట్టేంత. (అందులోనూ అతడు పందెంగా ఒడ్డిన ద్రౌపది అతడొక్కడికే భార్య కాదు! ఆమెను ఒడ్డేముందు ఆమె ఆమోదం, ఆమె ఇతర భర్తల అంగీకారం తీసుకోవాలనే కనీస బాధ్యత కూడా మరిచిపోయేటంతగా ఆ వ్యసనానికి బానిసైనాడు). దీన్ని ఎవరైనా ఏ రకంగా సమర్థిస్తారో నాకర్థం కాదు. అందులోనూ ఇవే పందాలు ఒడ్డి ఓడిపోవడం వెంటవెంటనే రెండుసార్లు జరిగింది. మొదటిసారి ఓడిపోయినప్పుడు ద్రౌపదికి ధృతరాష్ట్రుడు ఇచ్చిన వరాలతో దాస్యవిముక్తి పొందిన వాడు, మళ్ళీ వెంటనే గుడ్డిగా జూదానికి సిద్ధపడ్డమేమిటో! బలహీనతలున్నవాళ్ళు బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉండతగరు. కేవలం దృష్టి లోపం వల్ల ధృతరాష్ట్రుడు రాజ్యపాలనకు అనర్హుడైతే, వ్యసనపరుడు కాబట్టి యుధిష్ఠిరుడూ అనర్హుడే కావాలి.
ఇక అందరికీ తెలిసినా గుర్తించడానికి ఇష్టపడని, కుంటిసాకులు చెప్పే విషయాలు(చారిత్రక దృక్పథంతో చూసినప్పుడు కృష్ణుడు భగవదవతారమనే విషయాన్ని కాసేపు మరిచిపోదాం):
భీష్ముడి చావు: యుద్ధభూమిలో రాత్రిపూట శతృశిబిరానికి వెళ్ళి "బాబ్బాబు! నువ్వు చచ్చిపో! లేదా కనీసం నిన్నెలా చంపాలో నువ్వే చెప్పు." అని దేబిరించినవాడు యుధిష్ఠిరుడు.
ద్రోణుడి చావు: 'మిన్ను విరిగి మీదపడినా సరే వీడు అబద్ధమాడడు' అని నమ్మించి అతిఘోరమైన అబద్ధంతో గురువు ప్రాణాలనే బలిగొన్నవాడు యుధిష్ఠిరుడు. (యుద్ధంలో గెలవాలంటే గురువును చంపక తప్పదని ముందే తెలుసు. కానీ చంపించడానికి అవలంబించిన పద్ధతే అనైతికం.)
అది అనైతికం కాదనే వాళ్ళు ఒక్కసారి నిష్పాక్షికంగా ఆలోచించండి: ద్రోణుడికి వినబడేలా చెప్పదలచుకున్నదేమో పచ్చి అబద్ధం. ఆ అబద్ధాన్ని కూడా ధైర్యంగా చెప్పలేని పిరికివాడు, అబద్ధాన్ని నిజంలా భ్రమింపజేయడానికి మరింత కుటిలత్వానికి పాల్పడినవాడు యుధిష్ఠిరుడు.
ఇక కర్ణుడి చావులోనూ, దుర్యోధనుడి చావులోనూ జరిగింది అధర్మమే. "నిరాయుధుల మీద ఆయుధాన్ని ప్రయోగించరాదు." ఇది యుద్ధనీతి. భీష్ముణ్ణీ, ద్రోణుణ్ణీ ఆయుధం ప్రయోగించలేని స్థితిలోకి నెట్టీ, కర్ణుణ్ణి నిరాయుధుడుగా ఉన్నప్పుడూ చంపడం జరిగింది. వాళ్ళలో ఏ ఒక్కరు చనిపోకపోయినా యుద్ధఫలితం తారుమారై ఉండేది.
ఇక గదాయుద్ధంలో ప్రథమ నియమం: గదను నాభి క్రిందిభాగంలో ప్రయోగించరాదు. దుర్యోధనుణ్ణి చంపిందేమో గదతో తొడలు విరగ్గొట్టి. చిన్నప్పుడు భీముణ్ణీ, పెద్దయ్యాక లక్క ఇంట్లో పాండవులందరినీ చంపబూనడం, మాయాజూదం కౌరవులు చేసిన నేరాలైతే, వాటిని సాకులుగా చూపి పాండవులు చేసిన తప్పుడు పనులు అంతకంటే ఎక్కువే. యుద్ధం ధర్మబద్ధంగా జరిగి ఉన్నట్లైతే పాండవులు తుక్కుతుక్కుగా ఓడిపోయుండేవాళ్ళు.
మహాభారతయుద్ధం చరిత్రే. అందులో అనుమానం లేదు. ఐతే స్వర్గారోహణపర్వం లాంటివి కేవలం కవుల కల్పన. "ఒక్క విజయం వంద తప్పుల్ని కప్పేస్తుంది." అన్నట్లు కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు పొందిన అంతిమ విజయం వారిలోని లోటుపాట్లను కప్పేసి వారిని హీరోలను చేసింది.
Thursday, July 13, 2006
దశావతారాలు-2
పరశురామ:
సామాజిక పరిణామం ప్రాథమిక దశలో ఉన్నప్పుడు, మనుషుల్లోని పశుప్రవృత్తి పూర్తిగా సమసిపోనప్పుడు, ఆటవిక న్యాయం ఇంకా రాజ్యమేలుతున్నప్పుడు ధర్మసంస్థాపన కోసం కలుపు మొక్కల్ని నిర్దాక్షిణ్యంగా ఏరిపారేయడానికి ఆయుధం పట్టక తప్పదు. పరశురాముడు చేసింది అదే! (ధర్మసంస్థాపనకు) అడ్డొచ్చిన వాళ్ళందరినీ నరికిపారేశాడు. తర్వాత నిదానంగా ప్రజాపతుల ఆధ్వర్యంలో ధర్మబద్ధమైన పాలన, శాంతిభద్రతలు నెలకొన్నాయి. అంతే కాదు. తప్పుచేసినవారిని దేవుడే శిక్షిస్తాడంటూ తనను వారింపజూసిన మునులతో "దేవుడనేవాడు ఆకాశం నుంచి ఊడిపడడు. మనలో ఒకడిగా ఉంటూనే తప్పు చేసినవారిని శిక్షించి ధర్మాన్ని నిలబెడతాడు. ఐనా నేను దేవుణ్ణి కానని మీకెలా తెలుసు?" అని గర్జించిన పరశురాముడు బహుశా ప్రపంచసాహిత్యంలో మొట్టమొదటి విప్లవవీరుడు.
తర్వాతిది రామావతారం. "యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానామ్ సృజామ్యహమ్" అంటూ పట్టాలు తప్పిన బండిని తిరిగి పట్టాలెక్కించడమే శ్రీరాముడు చేసింది. ఇలాంటి ప్రమాదాలు అరుదుగా మాత్రమే జరిగే అవకాశమున్న త్రేతాయుగమది. ఏది ధర్మం, ఏది అధర్మం అన్న విషయంలో కూడా అస్పష్టత/గందరగోళమేమీ లేదు.(రామావతారం గురించి, రామాయణం గురించి ఇంకొక జాబు రాస్తాను.)
తర్వాతిది ద్వాపరయుగంలోని శ్రీకృష్ణావతారం. ఈ యుగంలో ధర్మం రెండు పాదాల మీదే కుంటుకుంటూ, గెంటుకుంటూ నడుస్తుందని చెప్తారు. ఇది ధర్మానికి, అధర్మానికి మధ్య సంధికాలం. ఏది ధర్మం, ఏది అధర్మం అనే విషయంలో కూడా స్పష్టత లేదు. అంతా అస్పష్టత, అయోమయమే. ఈ గందరగోళం; ధర్మాధర్మాల మధ్య ఊగిసలాట ప్రతి మనిషి ప్రవర్తనలోనూ మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఒక సందర్భంలో ఉత్తములనిపించినవారి ప్రవర్తనే ఇంకొక సమయంలో హీనంగా అనిపిస్తుంది. దీనికి మినహాయింపు బహుశా విదురుడొక్కడేనేమో? అలాంటి పరిస్థితుల్లో దేవుడే దిగివచ్చినా వాళ్ళ మధ్య నెగ్గుకురావడానికి మాయోపాయాలు, బలప్రయోగం తప్పనిసరి. కృష్ణుడంతటివాడికే తప్పలేదు! :(
మహాభారత యుద్ధంలో పద్దెనిమిది రోజుల్లో పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యం నిర్మూలమైంది. (అక్షౌహిణి అంటే 109350 కాల్బలం, 65610 గుర్రాలు, 21870 రథాలు, అన్నే ఏనుగులు అట) ఆ కాలంలోనే దానికి ముందూ ఆ తర్వాతా కూడా ఎన్నో యుద్ధాలు జరిగాయి. అంటే దేశంలోని యువకులు, ఆరోగ్యవంతుల్లో చాలా మంది చనిపోయి ఉండాలి. దాంతో సహజంగానే ఉత్పాదకత పడిపోతుంది. (పాండవబీడు అనే మాట అందుకే పుట్టింది. మిగిలింది బీడే. భూమిని సాగుచేసేవాళ్ళూ లేరు. పన్నులు కట్టేవాళ్ళూ లేరు. ఖజానా ఖాళీ. అంత పెద్ద యుద్ధం జరిగాక ఇంకేం మిగిలుంటుంది? అందుకే రాజసూయ యాగం పేరు చెప్పి ఇతరరాజ్యాల మీద పడ్డారు - దోచుకోవడానికి.) పోయినవాళ్ళు పోగా మిగిలినవాళ్ళలో కాస్త తెలివో బలమో ఉన్నవాళ్ళు ఉత్పాదకవనరులపై ఆధిపత్యం కోసం తమకు చేతనైన మార్గాల్లో ప్రయత్నించడం వల్ల మళ్ళీ అరాచకం మొదలై ఉంటుంది. ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి బుద్ధుడు రావలసి వచ్చింది.
ఇతర చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే క్రీ.పూ.6వ శతాబ్దంలో ఉత్తరభారతదేశంలో గంగా-యమునా నదీతీరాల వెంబడి నగరీకరణ భారీ స్థాయిలో జరిగింది. పెద్దపెద్దపట్టణాలు వెలిశాయి. ఒకవైపు పట్టణ సంస్కృతిలో తప్పనిసరిగా ఉండే జీవనపోరాటాలు, విచ్చలవిడితనం, అనైతికత, నేరప్రవృత్తి; ఇంకొక వైపు పెరిగిపోతున్న జంతుబలులు, పూజల పేరుతో జరిగే అర్థం పర్థం లేని తంతూతతంగాలు ప్రజల్లో అలజడి, అశాంతి పెరిగిపోవడానికి కారణాలయ్యాయి. పర్యవసానమే ప్రజలు బుద్ధుడి బోధలపట్ల ఆకర్షితులు కావడం.
ఇంతకంటే భారీస్థాయిలో అశాంతి రేగినప్పుడు, నేరాలు - ఘోరాలు అదుపు చెయ్యలేని స్థాయికి చేరినప్పుడు మళ్ళీ పరశురాముడు చేసినపనే చెయ్యవలసివస్తుంది. ఆ రెండో పరశురాముడే కల్కి.
పురాణాల్లో నాకు నచ్చిన పాత్ర పరశురాముడు.




